దీపావళి ఎఫెక్ట్... హైదరాబాద్ లోని సరోజిని కంటి ఆసుపత్రికి పెరిగిన రద్దీ

  • బాణాసంచా కాల్చే ఉత్సాహంలో అజాగ్రత్త
  • నగరంలో పలువురు చిన్నారులకు గాయాలు
  • కంటి గాయాలతో సరోజినిదేవి ఆసుపత్రిని ఆశ్రయిస్తున్న బాధితులు
హైదరాబాద్ నగరంలో దీపావళి వేడుకల సందర్భంగా బాణసంచా కాల్చే సమయంలో అజాగ్రత్తగా వ్యవహరించిన పలువురు గాయాలపాలయ్యారు. మెహదీపట్నంలోని సరోజినీదేవి కంటి ఆసుపత్రికి గాయపడిన వారు చికిత్స కోసం తరలివచ్చారు. ఆసుపత్రి ఆర్ఎంఓ డాక్టర్ ఇబ్రహీం తెలిపిన వివరాల ప్రకారం, ఇప్పటివరకు మొత్తం 10 మంది కంటి గాయాలతో ఆసుపత్రిని ఆశ్రయించారు. వారిలో ఏడుగురు చిన్నపిల్లలు ఉన్నారు.

దీపావళి సందర్భంగా టపాసులు చేతిలో పేలడం, కళ్లలో ముక్కలు పడడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. గాయపడిన వారికి తగిన చికిత్స అందిస్తున్నట్లు డాక్టర్ ఇబ్రహీం వెల్లడించారు. "ఇంకా కేసులు వచ్చినా చికిత్స చేయడానికి పూర్తి సన్నాహాలు చేశాం" అని ఆయన తెలిపారు.

మరోవైపు టపాసుల వల్ల గాయాలైన బాధితులు పలు ప్రైవేటు కంటి ఆసుపత్రులను కూడా ఆశ్రయిస్తున్నారు. ప్రతి సంవత్సరం దీపావళి రోజున ఇలాంటి ఘటనలు పునరావృతమవుతున్నాయి. ప్రజలు బాణసంచా కాల్చేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు, అధికారులు హెచ్చరిస్తున్నారు. 

Sarojini Devi Eye Hospital
Hyderabad
Diwali
firecrackers
eye injuries
RMO Ibrahim
Mehdipatnam
children
accidents

More Telugu News